57 రోజులు అన్యాయంగా జైలు జీవితం.. 16 ఏళ్ల తర్వాత బాధితుడికి న్యాయం

  • ఆమ్‌చూర్ పౌడర్‌ను డ్రగ్స్‌గా భావించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
  • భోపాల్ విమానాశ్రయంలో 2010లో ఘటన
  • 57 రోజుల పాటు జైలులో గడిపిన బాధితుడు
  • 16 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రూ.10 లక్షల పరిహారం
  • యంత్రాలపై గుడ్డి నమ్మకం తగదని హైకోర్టు వ్యాఖ్య
విమానాశ్రయ అధికారులు చేసిన ఓ ఘోర తప్పిదం వల్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 57 రోజుల పాటు అన్యాయంగా జైలు జీవితం గడిపారు. బ్యాగులో ఉన్న ఆమ్‌చూర్ పౌడర్‌ను (మామిడి పొడి) మాదకద్రవ్యంగా భావించి అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం. 16 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతనికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని జబల్‌పూర్ ప్రధాన పీఠం (హైకోర్టు) ఆదేశించింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజయ్ సింగ్ 2010లో ఢిల్లీ వెళ్లేందుకు భోపాల్‌లోని రాజా భోజ్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా ఆయన బ్యాగ్‌ను స్కానింగ్ మెషీన్‌లో పంపినప్పుడు అలర్ట్ వచ్చింది. అధికారులు బ్యాగును పరిశీలించగా అందులో ఉన్న పొడి పదార్థాన్ని మాదకద్రవ్యంగా అనుమానించి అజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మెషీన్ ఇచ్చిన హెచ్చరిక ఆధారంగా ఆయనపై నార్కోటిక్స్ చట్టం కింద తీవ్రమైన అభియోగాలు నమోదు చేసి జైలుకు పంపారు. దాదాపు 57 రోజుల తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో అది వంటల్లో ఉపయోగించే సాధారణ ఆమ్‌చూర్ పౌడర్ అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఆయన్ను విడుదల చేశారు.

ఈ ఘటనపై అజయ్ సింగ్ న్యాయపోరాటం ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం, కేవలం మెషీన్ రీడింగ్‌పై ఆధారపడటం వల్లే తాను స్వేచ్ఛను కోల్పోయానని వాదించారు. కేసును విచారించిన జబల్‌పూర్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. అమాయక పౌరుడిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. సాంకేతిక యంత్రాలపై గుడ్డిగా ఆధారపడకుండా సరైన విచారణ జరపాలని అధికారులకు సూచిస్తూ, బాధితుడికి రూ.10 లక్షల పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది.

Ajay Singh
Software Engineer
False Arrest
Compensation
Madhya Pradesh High Court
Amchur Powder
Airport Security
Narcotics Act
Jabalpur High Court
Raja Bhoj Airport

More Telugu News